అందుకే గ్యాస్ లీక్ కేసులో పారదర్శకంగా నివేదికను జనం ముందుంచారు: విజయసాయిరెడ్డి

  • కంపెనీదే తప్పని నిపుణులు తేల్చారు
  • తప్పు చేసినవారు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని జగన్ అన్నారు 
  • కమిటీ ఇచ్చిన సూచనలను తప్పక పాటిస్తారు 
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ నిన్న సీఎం వైఎస్ జగన్‌కి నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. ఆ నివేదికలో కమిటీ కీలక విషయాలను తెలిపింది. ఆ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని చెప్పింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

'విశాఖ గ్యాస్ లీక్ కేసులో హై పవర్ కమిటీ  నివేదిక వచ్చాక పచ్చ బ్యాచ్ నోళ్లు మూతపడ్డాయి. కంపెనీదే తప్పని నిపుణులు తేల్చారు. తప్పు ఎవరు చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందే అన్నారు సీఎం. కమిటీ ఇచ్చిన  సూచనలను  తప్పక  పాటిస్తారు. అందుకే పారదర్శకంగా  నివేదికను జనం ముందుంచారు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మరోపక్క, పేదలకు ఇళ్ల పట్టాల విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తీరు సరికాదంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'జగన్ గారి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే.. నిరసనలకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్‌లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం.. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం.. ఇంకెంత దిగజారతావు బాబూ? 2024లో నీ అడ్రస్ గల్లంతే' అని ఎద్దేవా చేశారు.

Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News